అధికారుల సహకారంతో ఎక్కడికక్కడ మందును పంపిణీ చేస్తాం: ఆనందయ్య

  • ఆనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • మూడు రోజుల్లో మందు పంపిణీపై ప్రకటన చేస్తానన్న ఆనందయ్య
  • ఇప్పటి వరకు 50 వేల మందికి మందును పంపిణీ చేశానని వ్యాఖ్య
ఎందరో కరోనా వ్యాధిగ్రస్తుల పాలిట ఆనందయ్య ఆపద్బాంధవుడిగా మారారు. ఆయన తయారు చేస్తున్న నాటు మందు కోసం సామాన్యులే కాకుండా... వీవీఐపీలు సైతం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు ఆయన చేత మందు తయారు చేయించుకుని... వారి ఇళ్లకు తీసుకెళ్లినట్టు ఒక టాక్. మరోవైపు, ఆనందయ్య మందుకు నిన్ననే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ ఉన్నవారెవరూ మందుకోసం రావద్దని కోరారు. అధికారుల సహకారంతో మందును ఎక్కడికక్కడ పంపిణీ చేస్తామని తెలిపారు. మూడు రోజుల్లో ప్రభుత్వ అధికారులతో తమ కుటుంబసభ్యులు చర్చిస్తారని... ఆ తర్వాత, మందును ఎప్పటి నుంచి పంపిణీ చేస్తాననే విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.

తనను పోలీసులు నిర్బంధించలేదని... తనకు రక్షణ కల్పించారని ఆనందయ్య తెలిపారు. పేదవారికి కూడా తాను మందును అందించానని... ఇప్పటి వరకు 50 వేల మందికి మందును ఇచ్చానని చెప్పారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందును అందిస్తామని... ఆ తర్వాత ఇతరులకు పంపిణీ చేస్తామని తెలిపారు. మరోవైపు, మందు తయారీకి కావాల్సిన వనమూలికలను ఆయన శిష్యగణం సిద్ధం చేస్తున్నారు.

Anandaiah
Corona Medicine
Andhra Pradesh

More Telugu News